- బ్రాండ్ వాల్యూలోనూ రోహిత్
- ఇప్పటికే 20 ప్లస్ కంపెనీలకు అంబాసిడర్గా శర్మ
న్యూఢిల్లీ: అన్ని ఫార్మాట్లలోనూ అదిరిపోయే బ్యాటింగ్తో దూసుకెళ్తున్న టీమిండియా ఓపెనర్, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతకూ పెరుగుతోంది. వన్డే వరల్డ్కప్లో ఐదు సెంచరీలతో చెలరేగిన తర్వాత స్టార్ క్రికెటర్ కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. టెస్టు ఓపెనర్గా కొత్త ఇన్నింగ్స్లోనూ హిట్మ్యాన్ సూపర్ హిట్ కావడంతో తమ ప్రొడక్ట్స్కు రోహిత్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి. రోహిత్ మేనేజ్మెంట్ వర్గాల సమాచారం మేరకు స్టార్ క్రికెటర్ ప్రస్తుతం ఇరవై పైచిలుకు బ్రాండ్లతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
సియాట్ టైర్స్, అడిడాస్, హుబ్లోట్ వాచెస్, రెలీ స్ప్రే, రస్నా, ట్రుసాక్స్, షార్ట్ ఎలక్ట్రానిక్స్, డ్రీమ్ 11.. వంటి మేజర్ బ్రాండ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అండార్స్మెంట్ల రూపంలో రోహిత్ ఏడాదికి ఎంత ఆర్జిస్తున్నాడో స్పష్టంగా తెలియకపోయినా.. ఏడాదికి అతని సంపాదన 75 కోట్లు పెరిగిందని బిజినెస్ వర్గాల సమాచారం. ప్రతీ బ్రాండ్కు ఒక రోజు టీవీ కమర్షియల్ షూట్, ప్రమోషనల్ ఈవెంట్, ప్రింట్ లేదా డిజిటల్ కమిట్మెంట్స్లో పాల్గొనేందుకు రోహిత్ ప్రస్తుతం కోటి రూపాయలు చార్జ్ చేస్తున్నాడట. వరల్డ్కప్ పెర్ఫామెన్స్తో రోహిత్ బ్రాండ్ వాల్యూ అమాంతంగా పెరిగిందని, టెస్టుల్లోనూ కన్సిస్టెంట్గా ఆడుతుండడంతో రోహిత్తో ఒప్పందాలకు కార్పొరేట్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నాయని చెబుతున్నాయి. కేవలం క్రికెట్లోనే కాకుండా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ రోహిత్కు కాసుల వర్షం కురిపిస్తోంది.

