వర్షాలు కురవాలని నగరపాలకులపై బురద చల్లిన స్థానికులు

వర్షాలు కురవాలని నగరపాలకులపై బురద చల్లిన స్థానికులు

దేశ వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలతో జనం అల్లాడుతుంటే... కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడు వరణుడు కరుణిస్తాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు తగ్గాలని పూజలు చేస్తుంటే.. మరి కొన్ని చోట్ల వానలు పడాలని వింత వింత ఆచారాలు పాటిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ ఆచారం ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అక్కడి ప్రజలు కొన్నేళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అందులో భాగంగా వరుణ దేవుడి దర్శనం త్వరగా కావాలని ఆశిస్తూ.. అక్కడి స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక ఛైర్మన్ పై బురద చల్లారు. ఇలా చేయడం వల్ల వర్షాలు వస్తాయని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని అక్కడి ప్రాంత ప్రజల నమ్మకం.

ఇది మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా ప్రాంతంలో జరిగింది. ఎంతగానో విశ్వసించే ఈ ఆచారంలో భాగంగా అక్కడి మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, నగర పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు మట్టి స్నానం చేయిస్తూ పాటలు పాడారు. ఏటా తాము ఈ సంబరాలు నిర్వహిస్తామని, దీని వల్ల ఇంద్ర దేవుడు సంతోషిస్తాడని తాము నమ్ముతామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పిల్లలు కూడా ఈ బురద నీటిలో స్నానం చేస్తారని.. దీన్నే వారి వ్యవహారిక భాషలో కల్ కలూటి అనే పేరుతో పిలుస్తారని తెలిపారు. వారి నమ్మకం సంగతి పక్కన పెడితే.. ఇలా నగర పాలకులకు బురద నీటితో స్నానం చేయించడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.