న్యూఢిల్లీ : ‘నేను’ అనే మాట తమ డిక్షనరీలోనే లేదని, ‘మనం’ అని అనుకోవడం వల్లే విజయాలు సాధిస్తున్నామని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అంతేకాక వరల్డ్కప్ సెమీఫైనల్లో ఓటమి బాధ ఎప్పటికీ తీరదన్నాడు. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో ఆడబోయే వన్డేలను టీ20 వరల్డ్కప్కు సన్నాహకాలుగా భావిస్తామన్నాడు. ‘వరల్డ్కప్ ఓటమి విషయాన్ని పక్కనబెడితే.. పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని జట్లపై అన్ని దేశాల్లో గెలిచాం. మొదటి నుంచి మా టార్గెట్ కూడా అదే. కానీ వరల్డ్కప్ సాధించలేకపోయామనే బాధ ఎప్పటికీ వేధిస్తుంది. ఆ లక్ష్యాన్ని కూడా పూర్తి చేస్తాం. మా టీమ్ డిక్షనరీలో మనం అనే మాట తప్ప నేను అనే పదం లేదు. ఎవరు ఏం సాధించినా జట్టంతా సంబరాలు చేసుకుంటుంది. అందుకే మేము గెలుస్తున్నాం. ఈ ఏడాదిలో ఇకపై మేము ఆడే వన్డేలను టీ20లకు కొనసాగింపుగా భావిస్తున్నాం. ఆసీస్ను ఓడించడం చూశాకా జట్టు మానసికంగా ఎంత బలంగా ఉందో ఎవరికైనా అర్థమవుతుంది. విరాట్ అన్నట్టు మా ధైర్యానికి ఆ విజయం నిదర్శనం. కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ టీమ్లో ఉండడం ఆనందంగా ఉంది. ధవన్ విషయమే కాస్త బాధగా ఉంది. కేదార్ను పక్కనపెడతామనే దాంట్లో నిజం లేదు. కివీస్లో ఆడే మా వన్డే టీమ్లో అతను కూడా ఓ సభ్యుడు. మిగిలిన వాళ్లు ఎలాగో కేదార్ కూడా అంతే. కుల్దీప్, చహల్ ఇద్దరూ ఫైనల్ ఎలెవెన్లో ఉండడమనేది మ్యాచ్ ఆడే వికెట్, ఆ రోజు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ విషయంలో సెలెక్టర్లదే తుది నిర్ణయం’ అని అన్నాడు.

