హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే వరల్డ్కప్కు ఇండియా అర్హత సాధించడంపై జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది వెల్కమ్ న్యూస్ అని అన్నది. లాక్డౌన్ లిఫ్ట్ చేశాకా తమకు ఎంతో రిలీఫ్ దక్కుతుందని అభిప్రాయపడింది. అనుకోకుండా వచ్చిన ఇలాంటి లాంగ్ బ్రేక్ తర్వాత తాము మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. గతేడాది నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో చివరగా పాల్గొన్న మిథాలీ తాము మళ్లీ మైదానంలోకి వచ్చే వరకు కొంత ఇబ్బంది తప్పదని తెలిపింది. ‘ఇంత లాంగ్ గ్యాప్ను ఎదుర్కోవడం కొంత ఇబ్బందే. ఇప్పుడు ట్రెయినింగ్ సెషన్స్ అన్నీ ఆగిపోవడంతో మేమంతా ఇళ్లకే పరిమితమయ్యాం. ఇంట్లో కొన్ని డ్రిల్స్ మాత్రమే చేసే వీలుంటుంది. అందువల్ల కమ్బ్యాక్ కొంత సవాల్తో కూడుకున్నదే. అదే సమయంలో ఈ మహమ్మారి ఎంత ప్రమాదకరమో మనం మర్చిపోకూడదు. ఇది మొత్తం ప్రపంచాన్నే స్తంభింపచేసింది. ఒకరకంగా ఇంట్లో కూర్చున్నందుకు మేం అదృష్టవంతులం అని చెప్పాలి. బయట చాలా మంది పని, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ స్టాఫ్ తదితరులు ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారు’ అని మిథాలీ చెప్పుకొచ్చింది.
రోజంతా ఇంట్లోనే కూర్చోలేం కదా..
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మిథాలీ తనను తాను మోటివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. తన అపార్ట్మెంట్లో వాచ్మన్తో కలిసి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నానని తెలిపింది. ‘మనం రోజంతా ఇంట్లోనే కూర్చోలేం. ముఖ్యంగా చాలా ఏళ్లుగా ప్రతి రోజూ గ్రౌండ్కు వెళ్లి ప్రాక్టీస్ చేసే వాళ్లకు సడెన్గా ఆ సౌకర్యం లేకపోతే తట్టుకోవడం కష్టమే. అయితే, ఇలాంటి టైమ్లో మనం సొంతగా ఎంటర్టైన్మెంట్ లేదా ఇతర యాక్టివిటీలను సృష్టించుకోవాలి’ అని మిథాలీ అభిప్రాయపడింది.
ఈ టోర్నీనే టర్నింగ్ పాయింట్
2017 వన్డే వరల్డ్కప్ ఇండియా మహిళల టీమ్కు టర్నింగ్ పాయింట్ అని మిథాలీ అన్నది. ఈ టోర్నీతోనే జట్టుకు ఊపు వచ్చిందని చెప్పింది. ఈ టోర్నీ టీవీల్లో టెలీకాస్ట్ కావడంతో తమ పెర్ఫామెన్స్లను ప్రజలు గుర్తించడం మొదలు పెట్టారన్నది. ఆ వరల్డ్కప్ తర్వాత స్వదేశంతో పాటు ఫారిన్లో ఇండియా బాగా ఆడుతోందని మిథాలీ చెప్పింది. ‘చాలెంజర్ సిరీస్ లాంటి టోర్నమెంట్లు షెఫాలీ వర్మ లాంటి యంగ్ టాలెంట్స్ను బయటకు తీసుకొస్తున్నాయి. అలాగే, ఇంటర్నేషన్ టోర్నమెంట్లు స్టార్ట్ అవ్వడానికి పది రోజుల బీసీసీఐ మన ప్లేయర్లను ఫారిన్కు పంపించడం జట్టుకు హెల్ప్ అవుతోంది. దాని వల్ల టోర్నీకి ముందు కుదురుకోవడానికి అవకాశం లభిస్తోంది’ అని చెప్పింది.
వాటికంటే ఇండియా తక్కువేం కాదు
ప్రస్తుత టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్ అంత బలంగా ఉందని మిథాలీ అభిప్రాయపడింది. ‘ఇప్పుడు పెర్ఫామెన్స్ విషయంలో టీమ్స్ మధ్య గ్యాప్ తగ్గుతోంది. ఇందులో బెస్ట్ ఏంటంటే శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, థాయ్లాండ్ కూడా అద్భుతమైన ప్రోగ్రెస్ సాధిస్తున్నాయి. దీనికి కారణం ఐసీసీ చాంపియన్షిప్. అయితే, మనం మాత్రం మానసిక సామర్థ్యంపై మరింత దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వరల్డ్కప్స్ ఫైనల్ రౌండ్స్లో బాగా రాణించేందుకు మెంటల్గా ప్రిపేర్గా అవ్వాలి. ఆ టైమ్లో ప్రెజర్ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. మొన్నటి టీ20 వరల్డ్కప్నే చూస్తే.. ఒత్తిడి వల్లే మా జట్టు తన నేచురల్ గేమ్ ఆడలేకపోయింది. గత మూడు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్లోనూ ఇదే జరిగింది’ అని మిథాలీ పేర్కొంది.