7 ఎక్స్ట్రాలే జట్టు స్కోరు
754 రన్స్ తేడాతో ఓటమి
ముంబై: క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు కనీవిని ఎరుగని.. కనీసం ఊహకు కూడా అందని ఘటన చోటుచేసుకుంది. టీమ్ టీమంతా డకౌట్ అవ్వడమే కాకుండా ఎక్స్ట్రాల రూపంలో వచ్చిన 7 పరుగులతో 6 ఓవర్లలోనే కుప్పకూలి.. 754 రన్స్తేడాతో ఓడిపోయింది. ముంబైలోని హారిస్ షీల్డ్ అండర్–16 స్కూల్ మ్యాచ్ ఈ చెత్త రికార్డుకు వేదికైంది. ఈ ఘోర పరాభావాన్ని అంథేరీ చిల్డ్రన్స్ అకాడమీ టీమ్ మూటగట్టుకుంటే..వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ ఊహకందని విజయాన్ని అందుకుంది. ఆజాద్ మైదాన్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వివేకానంద స్కూల్ 39 ఓవర్లలో 4 వికెట్లకు 605 రన్స్ చేసింది.
కానీ స్లో ఓవరేట్తో నిర్ణీత 45 ఓవర్లను చిల్డ్రన్స్ అకాడమీ జట్టు పూర్తి చేయకపోవడంతో అంపైర్లు 156 పరుగులను పెనాల్టీగా విధించారు. తర్వాత 761 రన్స్ భారీ టార్గెట్తో ఛేజింగ్కు దిగిన చిల్డ్రన్స్ అకాడమీ బ్యాట్స్మెన్ అంతా డకౌటయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో అలోక్ పాల్ (6/3), వరో వజ్(2/3) రాణించగా ఇద్దరు బ్యాట్స్మెన్ రనౌట్గా వెనుదిరిగారు. నాటౌట్గా నిలిచిన ఆటగాడు కూడా ఖాతా తెరవలేకపోయాడు. అయితే జట్ల ఎంపికలో నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ చెత్తాటకు కారణమని తెలుస్తోంది.


