
- మరి సింగరేణిపై దిగిరాలేదే?
- కేసీఆర్ దెబ్బకు ఆంధ్రలోనే కేంద్రం దిగొచ్చిందా?
- విశాఖ ఉక్కుపై బీఆర్ఎస్ లీడర్ల వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్
అమరావతి : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ వల్లే కేంద్రం దిగివచ్చిందన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘బాగా దిగి వచ్చింది కేంద్రం. చాలా చూశాం కదా. వీళ్లు, వాళ్లు కేసులు పెట్టుకోవడంతోనే సరిపోతోంది. తెలంగాణలో దేనికీ దిగిరాలేదా? ఆంధ్రాలోనే దిగొచ్చిందా? తెలంగాణలో ఏమైనయ్? సింగరేణిపై దిగిరాలేదా? కేంద్రం అమ్మేస్తున్నదని మీరే చెప్తున్నరు కదా. మరి ఆ విషయంలో ఎందుకు దిగి రావడం లేదు” అని ప్రశ్నించారు.
‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నిన్న అమ్ముతామన్నారు.. ఈరోజు అమ్మలేదని అన్నారు. సంతోషం. మేం కోరుకునేది కూడా అదే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రజల అస్తి. ప్రైవేటీకరణ చేయొద్దనేది వా పార్టీ విధానం. ప్రజల ఆస్తిగా ఉంచాలనేదే మా నినాదం. ప్లాంట్ను నడపాలి” అని అన్నారు.