- రాష్ట్రంలో రెండేండ్లుగా నిర్వహించని యువజన సంక్షేమ శాఖ
- వచ్చే నెలలో యూపీలోని లక్నోలో నేషనల్ ఫెస్టివల్
- రాష్ట్రం నుంచి కళాకారులను ఎంపిక చేయని అధికారులు
హైదరాబాద్, వెలుగు:
యువతలో దాగి ఉన్న టాలెంట్ను వెలికితీసేందుకు నిర్వహించే యూత్ ఫెస్టివల్స్ రాష్ట్రంలో రెండేండ్లుగా పత్తా లేకుండా పోయాయి. ఏటా డిసెంబర్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యూత్ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు పెడతారు. తర్వాత జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్స్ జరుగుతాయి. 23 ఏళ్లుగా ఏటా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో నేషనల్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈసారి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరుగనున్నాయి. ఈ ఫెస్టివల్కు పంపేందుకు పొరుగన ఉన్న ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో యువ కళాకారుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. మన రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించలేదు. బడ్జెట్లో యువజన సంక్షేమ శాఖకు కేటాయింపులు లేకపోవడంతోనే జిల్లా, రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ నిర్వహించలేదని అధికారులు చెప్తున్నారు. యువతలో జాతీయ సమైక్యత, మత సామరస్యం, సోదరభావం, ధైర్యసాహసాలను నింపేందుకు యూత్ఫెస్టివల్స్ఎంతగానో తోడ్పతాయని, అలాంటి కార్యక్రమాన్ని యువజన సంక్షేమ శాఖ పట్టించుకోకపోవడం సరికాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
18 రకాల ఈవెంట్లలో పోటీలు
యూత్ ఫెస్టివల్స్లో ఫోక్ సాంగ్, క్లాసికల్ వోకల్ సోలో, క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ సోలో (సితార్, ఫ్లూట్, మృదంగం, వీణ, తబలా, గిటార్), గ్రూప్ సాంగ్, క్లాసికల్ డ్యాన్స్ (భరతనాట్యం, కథక్, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ), ఫోక్ డ్యాన్స్, పెయింటింగ్, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర 18 రకాల ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. మండల స్థాయి పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నవారిని జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నవారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల కళాకారులతో పోటీపడి మొదటి స్థానంలో నిలిచినవారిని నేషనల్ యూత్ ఫెస్టివల్కు రాష్ట్రం తరఫున పంపుతారు. ఈ ఫెస్టివల్స్లో పతకాలను సాధించడాన్ని యువ కళాకారులు గౌరవంగా భావిస్తారు.
యూత్పై నిర్లక్ష్యం సరికాదు
యువతీ యువకులు తమ ప్రతిభను, కళలను ప్రదర్శించేందుకు యూత్ ఫెస్టివల్స్ మంచి వేదికగా ఉంటాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యూత్ ఫెస్టివల్స్ చేపడుతున్నా మన రాష్ట్రంలో బడ్జెట్ లేదనే కారణంతో నిర్వహించడం లేదు. ఇది సరికాదు. సర్కారు ఇప్పటికైనా షెడ్యూల్ ఖరారు చేసి యువ కళాకారుల బృందాలను నేషనల్ యూత్ ఫెస్టివల్కు పంపాలె. యువజన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం విచారకరం.- ఆకులపల్లి మధు, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత, వరంగల్ అర్బన్