బీఆర్ఎస్ నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు: వైఎస్ షర్మిల

బీఆర్ఎస్ నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు: వైఎస్ షర్మిల

బీఆర్ఎస్ నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేల అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ బతికే ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత పవన్‭ను ఆమె పరామర్శించారు. హనుమకొండలో రెండు రోజుల క్రితం పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై స్పందించిన షర్మిల.. ఈ దాడి ఘటనపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న వారిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.  ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రశ్నించినందుకు పవన్ పై దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీకి తగదన్నారు. పవన్ ముఖాన్ని గుర్తుపట్టకుండా దాడి చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు మనుషుల్లాగా ప్రవర్తించడం లేదన్నారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని షర్మిల నిలదీశారు.