న్యూఢిల్లీ : లాగవుట్ క్యాంపెయిన్తో ఏ మాత్రం వెనక్కి తగ్గని జొమాటో తాజాగా గోల్డ్ మెంబర్లకు స్పెషల్ డీల్స్తో కొత్త ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఇందులో ఫ్రీ వ్యాలెట్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో 20 కోట్ల మందికి సర్వీసెస్ అందించాలని టార్గెట్గా పెట్టుకున్నామని, రెస్టారెంట్ల చురుకైన భాగస్వామ్యంతో ‘గోల్డ్ స్పెషల్’ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’ అని సీఈఓ దీపిందర్ గోయెల్ వెల్లడించారు. గోల్డ్ కస్టమర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లతో కలిసి వాటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్లో 1.10 లక్షల కొత్త మెంబర్లు..
గత అక్టోబర్ నెలలో కొత్తగా 1.10 లక్షల మంది గోల్డ్ మెంబర్లుగా జాయినయినట్లు జొమాటో చెబుతోంది. జర్నీలో ఎగుడు, దిగుడులు ఉన్నప్పటికీ గోల్డ్ మెంబర్షిప్ను కస్టమర్లు ఇష్టపడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని గోయెల్ తెలిపారు. గోల్డ్ మెంబర్ షిప్ స్కీములోని కొన్ని యూజర్ పాలసీలు నచ్చకపోవడంతో కొన్ని రెస్టారెంట్లు జొమాటోకు వ్యతిరేకంగా లాగౌట్ క్యాంపెయిన్ మొదలెట్టాయి. దాంతో వందలాది మంది గోల్డ్ పార్ట్నర్స్తో కలిసి మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నాక గోల్డ్ మెంబర్షిప్లో కొన్ని మార్పులు తీసుకువచ్చామని గోయెల్ చెప్పారు.
మూడు రెట్లు పెరిగిన రెవెన్యూ….
దేశం మొత్తం మీద రోజూ 1.5 లక్షల రెస్టారెంట్ల నుంచి 13 లక్షల ఆర్డర్లను జొమాటో డెలివరీ చేస్తోంది. ఒక్కో రెస్టారెంట్కూ చూస్తే రోజుకు పది కంటే ఎక్కువే ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. మన దేశంలోని 50 సిటీలలో జొమాటో కిచెన్లు పనిచేస్తుండగా, 110 కిచెన్ హబ్లు ఏర్పాటులో ఉన్నాయి. మొత్తం మీద 663 కిచెన్ యూనిట్లు, కియోస్క్లు అందుబాటులో ఉన్నట్లు జొమాటో తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ మూడు రెట్లు పెరిగి 205 మిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొంది.