బెంగళూరు: తమ ఇంటి పక్కన ఉండే నర్సింగ్ విద్యార్థిని వల్ల తమకు కరోనా వైరస్ సోకిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెపై కత్తితో దాడి చేశారు. ఆమె తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించారు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు, ఇందిరానగర్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ప్రియదర్శి(20) నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్లో ఆమె తల్లి కోవిడ్ బారిన పడింది. ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్ సోకింది. ఈ క్రమంలో ప్రభు, ప్రియదర్శి వల్లే తాను కోవిడ్ బారిన పడ్డానని ఆరోపించసాగాడు. ఆమె కుటుంబం వల్లనే తనకు కరోనా సోకిందని ఆరోపిస్తూ.. మూడు రోజుల క్రితం ప్రియదర్శి తండ్రితో గొడవకు దిగాడు. ఆ సమయంలో ప్రభు సోదరులు ఇద్దరు అతడితో కలిసి బాధితురాలి తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించసాగారు.
ఈ క్రమంలో ప్రియదర్శి వారిని వారించడం కోస ప్రయత్నించగా.. ప్రభు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియదర్శి చెయ్యి తెగింది. దాంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రియదర్శి సోదరి సప్న మాట్లాడుతూ.. ప్రభుకి కరోనా సోకిన నాటి నుంచి మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారని.. మాపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని తెలిపింది. ప్రియదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభు, అతడి సోదరుల మీద కేసు నమోదు చేశారు.