- రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇల్లు సహా పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
- మాదాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట్లో కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
- భార్య పేరిట 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు, 4 అపార్ట్మెంట్లు, 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 4 బ్యాంకు ఖాతాల్లో 52 లక్షల నగదు సీజ్
- అధికారిక లెక్కల ప్రకారం రూ.28.14 కోట్ల విలువ చేసే ఆస్తులు
- బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా
- డీఈ వెంకటరమణ అరెస్ట్.. నేడు చంచల్గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) కేంద్రంగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన రెడ్కో ఖైరతాబాద్ డివిజనల్ ఇంజినీర్ ముత్యం వెంకట రమణను ఏసీబీ అరెస్ట్ చేసింది.
బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటల వరకు మాదాపూర్లోని అతని ఇంటితోపాటు శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 2 కిలోల బంగారం సహా రూ.20 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్లు, లగ్జరీ కార్లు, వాచీలను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.
4 బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.52 లక్షల డిపాజిట్లు, ఇంట్లో 19 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసు కున్నారు. ఆయన భార్య పేరిట ఏకంగా 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏర్పాటు చేయడం వెంకటరమణ అవినీతికి అద్దం పడుతోంది. మొత్తంగా సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.28.14 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.300 కోట్లకుపైగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. వెంకటరమణను గురువారం కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించనున్నారు.
లంచం తీసుకుంటూ చిక్కిన కేసులో రూ.49 లక్షలు పట్టివేత
ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వెంకటరమణ ఫ్యామిలీ హైదరాబాద్లో స్థిరపడింది. 1992లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన ఏఈగా ఉద్యోగంలో చేరాడు. వివిధ హోదాల్లో పనిచేశాడు. సైబర్ సిటీ సర్కిల్ డివిజనల్ ఇంజినీర్గా పనిచేస్తున్న సమ యంలో 2019 డిసెంబర్ 12న రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఈ కేసులో ఆయన ఇంట్లో సోదాలు చేయగా.. రూ.26.52 లక్షల నగదు, రూ.22.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొరికాయి.
అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాం డ్కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ లంచాల పర్వం కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2006 లో సొంతంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రారంభించాడు. గత రెండేండ్లుగా రెడ్కోకు డిప్యుటేషన్పై వచ్చాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప డుతున్న పీఎం కుసుమ్ ప్రాజెక్ట్ రాష్ట్ర ఇన్చార్జీగా వ్యవ హరిస్తున్నాడు.
సోలార్ ప్యానెళ్ల కంపెనీల నుంచి ముడుపులు
రాష్ట్రంలో రూ.6వేల కోట్లతో1,450 మెగావాట్ల సోలార్విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రైతుల పంట భూముల్లో సోలా ర్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కంపెనీలను ఫైనల్ చేసే నిర్ణయాధికారం వెంకటరమణ చేతిలోనే ఉన్నది. గతంలో 2, 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు, వంద నుంచి 300 కిలోవాట్లలోపు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే కంపెనీలు సైతం 1నుంచి 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే పను లకు పోటీ పడ్డాయి.
కొన్ని కంపెనీలకు చట్ట ప్రకారం అర్హతలు లేకున్నా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మార డంతో ‘పీఎం కుసుమ్’ ప్రాజెక్ట్ పనులు చేసే అగ్రిమెంట్లు చేసుకునేలా వెంకటరమణ వారికి మేలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.200 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. రెడ్కోకు సంబం ధించి అతి కీలక నిర్ణయాల ఫైల్స్ అన్నీ ఆయన దగ్గరికే వస్తాయని, ప్రైవేట్ కంపెనీలను, ఉన్నతాధికారులను మేనేజ్ చేసి డబ్బులు తీసుకోవడంలాంటి పనులు వెంకటరమణనే చేస్తారనే అభియోగాలున్నాయి.
సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు
- రెసిడెన్షియల్ ఫ్లాట్లు: శేరిలింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో (విలువ: రూ.1,23,46,000)
- జీ+3 వాణిజ్య సముదాయం: అంజయ్య నగర్, కూకట్పల్లి వద్ద 160 చదరపు గజాల స్థలంలో (విలువ: రూ.1,82,00,000)
- జీ+5 వాణిజ్య సముదాయం: శేరిలింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేట్ వద్ద 250 చదరపు గజాల స్థలంలో (విలువ: రూ. 2,90,03,550)
- బ్యాంకు నిల్వలు: నాలుగు బ్యాంక్ ఖాతాల్లో రూ. 52,02,585
- బంగారు ఆభరణాలు: 2,094 గ్రాములు
- (విలువ అంచనా: రూ.40,00,000)
- వెహికల్స్: కియా, మహీంద్రా, బలేనో కార్లు (విలువ: రూ.45,00,000)
- గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు: ( విలువ: రూ. 30,00,000)
- మద్యం సీసాలు: 20 లిక్కర్ సీసాలు (19 విదేశీ, 1 ఐఎంఎఫ్ఎల్ - విలువ రూ. 2,50,000) దీనిపై మాదాపూర్ ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది.
కన్స్ట్రక్షన్ సంస్థల్లో పెట్టుబడులు: తన భార్య పేరుతో నమోదైన 4 నిర్మాణ సంస్థల ద్వారా.. నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు గుర్తించారు. ఈ సంస్థల ద్వారా ఆంజనేయ నగర్, మూసాపేట, కూకట్పల్లి ప్రాంతాల్లో 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మించినట్టు గుర్తించారు. వీటి నిర్మాణానికి రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుందని తేల్చారు.
