
ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వ ప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలిగా జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అనలీనా బేబాక్ అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు మెజారిటీ మార్కు 88 ఓట్లు కాగా, అనలీనాకు 167 ఓట్లు దక్కాయి. మరో అభ్యర్థి అయిన జర్మన్ దౌత్యవేత్త హెల్గా ష్మిడ్కు 7 ఓట్లు మాత్రమే దక్కాయి.
రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగాలన్న రష్యా డిమాండుకు అనుగుణంగా సభ్య దేశాలు అనలీనా బేబక్ ను ఎన్నుకున్నాయి. 14 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. 2025, సెప్టెంబర్లో జరిగే ఐరాస సర్వప్రతినిధి సభ 80వ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు ఫిలెమాన్ యాంగ్ నుంచి అనలీనా బాధ్యతలు స్వీకరిస్తారు. 193 దేశాల సభ్యత్వం కలిగిన ఐరాస సర్వప్రతినిధి సభకు అధ్యక్షులను ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకుంటారు.
యూఎన్ జీఏ
ఐక్యరాజ్య సమితిలోని ఆరు ప్రధాన అంగాల్లో సర్వ ప్రతినిధి సభ ఒకటి. ఇది ఐరాసలోని అన్ని సభ్యదేశాలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక అంగం. దీనిని ప్రపంచ పార్లమెంట్గా పరిగణిస్తారు.
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 193 దేశాలు సర్వప్రతినిధి సభలో సభ్యులుగా ఉంటాయి.
ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది. దేశం పరిమాణం లేదా ఆర్థికశక్తితో సంబంధం లేకుండా సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.
ప్రతి సభ్య దేశంగా గరిష్టంగా ఐదుగురు ప్రతినిధులను పంపించవచ్చు. కానీ, ప్రతి దేశానికి ఒకే ఓటు ఉంటుంది.
ప్రతి సంవత్సరం సభ్య దేశాలు సభకు ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటాయి.
సర్వ ప్రతినిధి సభ సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సమావేశం అవుతుంది.
అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అత్యవసర సమస్యలను చర్చించడానికి ప్రత్యేక లేదా అత్యవసర ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు.