వివాదంలో అసద్ లోక్ సభ నుంచి వేటు తప్పదా?

వివాదంలో అసద్ లోక్ సభ నుంచి వేటు తప్పదా?
  •   జై పాలస్తీనాపై బీజేపీ తీవ్ర అభ్యంతరం
  •  కీలకంగా మారిన దేశ సమగ్రత అంశం
  •  రూల్  పొజిషన్ పరిశీలిస్తామన్నపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్​ రిజీజు
  •  రాష్ట్రపతి ముర్ముకు న్యాయవాదుల ఫిర్యాదు
  •  ఆర్టికల్ 102డీ ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంటరీ సభ్యత్వం వివాదంలో పడింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజీజూకు పలువురు ఎంపీలు కంప్లయింట్ చేశారు. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినదించారు.

 అయితే జై పాలస్తీనా అనడాన్ని బీజేపీ తప్పపడుతోంది. అసద్ చేసిన నినాదంపై సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్ ప్రకటించడంతో తాత్కలికంగా వివాదం సద్దుమణిగింది. ‘ప్రస్తుత నిబంధనల ప్రకారం పాలస్తీనాకు కట్టుబడి ఉన్నందుకు అసదుద్దీన్ ఒవైసీ తన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు. ఆర్టికల్ 102 (డీ) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేయాలి’ అని  బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా ఇవాళ పేర్కొన్నారు. 

ఇదే అంశంపై పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో అసదుద్దీన్ పాలస్తీనా అనుకూలంగా నినాదం చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇది భారతదేశ సమగ్రతకు, విధేయతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఆయన విదేశానికి కట్టుబడి ఉన్నానని పార్లమెంటు సాక్షిగా అంగీకరించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (డీ) ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ తక్షణమే పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని ఫిర్యాదులో తెలిపారు. 

 ఓవైసీ పాలస్తీనా పట్ల విధేయతను చూపుతున్నారని, ఆయన ఇలా వ్యవహరించడం మొదటి సారి కాదని ఈ సారి చర్య తీసుకోకపోతే భారతదేశ సమగ్రత, విధేయత, ఐక్యత అనే అంశాలకు అర్థమే లేదని పేర్కొన్నారు. మరోవైపు సీనియర్ లాయర్ విష్ణు శంకర్ జైన్ ఓవైసీపై లోక్ సభ సభ్యత్వంపై వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. 

నిబంధనలు పరిశీలిస్తం: రిజీజు

‘ఓవైసీ జై పాలస్తీనా వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందాయి. నిబంధనలను పరిశీలిస్తాం’అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. "పాలస్తీనాతో లేదా మరే ఇతర దేశంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, సభ్యుడు మరొక దేశాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేయడం సరైనదేనా? అనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

ఆర్టికల్ 102 డీ లో ఏముంది

పార్లమెంటు సభ్యుల అనర్హత.. విధి విధానాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 లో పొందు పర్చారు. అందులోని క్లాజ్ డీ ఏం చెబుతోందంటే.. 
చట్ట సభల్లోని సభ్యులెవరైనా.. భారత పౌరులు కాకున్నా..? స్వచ్ఛందంగా వాళ్లే విదేశీ పౌరసత్వాన్ని పొందినా.. ఏదైనా వేరే దేశానికి విధేయతను ప్రకటించినా.. కట్టుబడి ఉన్నాఆ సభ్యుడిపై వేటు వేయవచ్చని పేర్కొంది.