మానవ మృగాలతో.. ఆగని ఘోరాలు

మానవ మృగాలతో.. ఆగని ఘోరాలు
  • ఇంట్లో నిద్రిస్తున్న ఐదేండ్ల చిన్నారిపై అత్యాచార యత్నం 
  • జగిత్యాల జిల్లా తుమ్మెనాలలో ఘటన

జగిత్యాల/ ధర్మపురి, వెలుగు: ఇంట్లో నిద్రిస్తున్న ఐదేండ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల  గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సుమంత్  (18) రోజు మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం పక్కింట్లో టీవీ చూడటానికి వెళ్లాడు. ఆ టైంలో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద  కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితుడ్ని గురువారం సాయంత్రం 5.30 గంటలకు ధర్మపురి మండలం నేరెళ్ల సాంబ శివుని గుట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

మరో ఘటనలో..

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని అగ్గిమల్ల గ్రామంలో 11 ఏండ్ల బాలికపై గంగాధర  ప్రశాంత్ (27)  అనే యువకుడు అత్యాచారానికి  ప్రయత్నించాడు. ఈ ఘటన ఈనెల 10న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎదురింట్లోని బాలికను ప్రశాంత్ తన ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి  అత్యాచారానికి యత్నించగా.. గమనించిన బాలిక తల్లి అతడికి దేహశుద్ధి చేయడంతో ప్రశాంత్​ పారిపోయాడు. ఈనెల 14న బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని గురువారం అరెస్టు చేశారు.  

తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి..

  • హైదరాబాద్​లోని మంగళ్​హాట్​లో తొమ్మిదేండ్ల బాలికపై రేప్​ అటెంప్ట్

మెహదీపట్నం, వెలుగు: తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి తొమ్మిదేండ్ల బాలికను షెడ్డుకు తీసుకెళ్లి రేప్​కు ప్రయత్నించాడు ఓ యువకుడు. హైదరాబాద్  మంగళ్​హాట్​లోని మంగర్​బస్తీలో ఈ ఘటన జరిగింది. బస్తీకి చెందిన బాలిక తల్లిదండ్రులు బుధవారం రాత్రి గొడవపడి బయటకు వెళ్లిపోయారు. ఆ టైంలో నిద్రిస్తున్న బాలిక.. అర్ధరాత్రి లేచి తల్లిదండ్రులు కనిపించకపోయేసరికి ఏడుస్తూ వెతకసాగింది. గమనించిన పాప బంధువు సుమిత్ (19).. తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి,  ఓ షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక అరవడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. అది గమనించిన సుమిత్​ పారిపోయాడు. పోలీసులకు స్థానికులు ఫోన్​ చేయడంతో.. పాపను హాస్పిటల్​కు, తర్వాత భరోసా సెంటర్​కు  పంపించారు. పారిపోయిన సుమిత్​ నాంపల్లిలో పట్టుబడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి తెలిపారు.

వివాహితపై అత్యాచారం

లింగాల, వెలుగు: వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన వివాహిత(28) ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలంలో పనులు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన లావుడ్య పాండు(32) అనే ట్రాక్టర్ డ్రైవర్ పొలం దున్నడానికి వచ్చాడు. చేనులో వివాహిత ఒంటరిగా ఉండడం గమనించి బలవంతంగా పొలాల్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు. గురువారం మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య చెప్పారు.

మహిళపై అత్యాచారం, హత్య కేసులో..నిందితుడు అరెస్టు

ఆమనగల్లు, వెలుగు: జీహెచ్ఎంసీ స్వీపర్​పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆమనగల్లు మండలం ముర్తూజపల్లికి చెందిన పోచమ్మ(38) హైదరాబాద్​ గోషామహల్ ​ఏరియాలో జీహెచ్ఎంసీ స్వీపర్. లాక్​డౌన్ నుంచి కుటుంబంతో కలిసి తల్లిగారి ఊరైన మాడ్గుల మండలం చంద్రాయిన్​పల్లిలో ఉంటోంది. డైలీ చంద్రాయిన్​పల్లి నుంచి డ్యూటీకి వెళ్లి వస్తోంది.  ఈ నెల 14న డ్యూటీ అయిపోయాక ఆమనగల్లు చేరుకున్న పోచమ్మ ఊరికి వెళ్లేందుకు ఆటో స్టాండ్​లో నిలబడింది. అదే టైంలో గతంలో ఆమెకు పరిచయం ఉన్న సాకిబండ తండాకు చెందిన జైపాల్ నాయక్ తాను కూడా చంద్రాయిన్​పల్లి వైపు వెళ్తున్నానని నమ్మించి పోచమ్మను వెహికల్​లో ఎక్కించుకున్నాడు. మాలెపల్లి శివారులోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారం, వెండి ఆభరణాలు లాక్కుని పారిపోయాడు. మృతురాలి భర్త గాలయ్య ఫిర్యాదుతో కేసు ఫైల్​చేసిన పోలీసులు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.