
హైదరాబాద్: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 2024, మార్చి 3వ తేదీ ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు కలిశారు. మార్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. అయితే, ఆయన త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఫ్యామిలీతోపాటు సీఎంను కలువడంతో తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. ఇటీవల నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ అగ్రనేతలను కలవరానికి గురిచేస్తున్నట్లు సమాచారం.