గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు : కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక సింగరేణిలో వరుసగా కుంభకోణాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్రం.. ఈ స్కామ్లపై ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ఈ స్కామ్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆదివారం రాత్రి ఎన్టీపీసీలో జరిగిన టీబీజీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోల్ ఇండియాలో కూడా లేని సైట్ విజిట్ నిబంధనను.. సీఎం రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డికి లాభం చేకూర్చేందుకే తెచ్చారని ఆరోపించారు. శ్రీరాంపూర్లో రూ.600 కోట్ల ఓబీ వర్క్ టెండర్లలోనూ స్కామ్ జరిగిందన్నారు.
సింగరేణి వ్యాప్తంగా 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా.. స్టాక్ మాత్రం కనిపించడం లేదన్నారు. సింగరేణిలో అక్రమాల గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదన్నారు. రామగుండం సీఎస్పీ బొగ్గు బంకర్ వద్ద నిల్వలను పరిశీలించేందుకు వెళ్తున్న హరీశ్రావుతో పాటు పలువురు లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు, టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పెద్దపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరై మాట్లాడారు. హిట్లర్తో పోల్చుకుంటున్న సీఎం రేవంత్రెడ్డికి హిట్లర్ గతే పడుతుందన్నారు. రేవంత్రెడ్డి చేసే తప్పులకు, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు భవిష్యత్లో కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
