- తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తిపోతలకు సిద్ధం.. మహారాష్ట్రను ఒప్పించండి
- ఎన్టీపీసీలో మరో 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతివ్వాలి
- ‘జల్ జీవన్మిషన్’ కింద రాష్ట్రానికి నిధులివ్వాలి
- అదనంగా 29 మంది ఐపీఎస్లను కేటాయించాలి
- ప్రధాని మోదీకి 11 విజ్ఞప్తులతో వినతి పత్రం
హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ సహా ఎన్నో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని.. ఐఐఎంను కూడా హైదరాబాద్కు కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు సీఎం రేవంత్ అందజేశారు.
‘‘ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా, గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే తీసుకురాగలిగింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి ప్లాంట్లు ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనలో భాగంగా రివర్ ఫ్రంట్డెవలప్మెంట్కు సహకరించాలి. హైదరాబాద్–శ్రీశైలం హైవేపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారి డార్తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కి.మీ. దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ సులువు అవుతుంది’’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఆ భూములు అప్పగించండి..
రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఇప్పటికీ రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలకు నల్లా నీళ్లు అందడం లేదన్నారు. సమీపంలోని నీటి వనరుల ద్వారా ఊర్లకు మంచి నీటిని ఇచ్చేందుకు జల్ జీవన్ మిషన్ నిధులను కేటాయించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు తగ్గట్టుగా ఐపీఎస్కేడర్పై రివ్యూ చేయాలి. 2016లో రాష్ట్రానికి 76 ఐపీఎస్పోస్టులను కేంద్రం మంజూరు చేసింది. జిల్లాలు, జనాభా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఐపీఎస్అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 29 ఐపీఎస్ పోస్టులను అత్యవసరంగా కేటాయించాలి. హైదరాబాద్– రామగుండం, హైదరాబాద్–నాగ్పూర్రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్(తోఫెఖానా)ను రాష్ట్రానికి బదిలీ చేయాలి. శామీర్పేటలోని ఫీల్డ్ ఫైరింగ్రేంజ్కు సంబంధించిన 1,038 ఎకరాల భూముల లీజు గడువు ముగిసింది. ఆ భూములను తిరిగి అప్పగించాలి’’ అని కోరారు.
సెమీ కండక్టర్ల తయారీకి సాయమందించండి..
నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో రాష్ట్రంలో 5,259 ఆయుష్మాన్ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నామని.. వాటికి 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర వాటాగా రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ కోరారు. ‘‘భారత్మాల పరియోజన జాతీ య రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రానికి ఉపయోగపడే 8 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్–నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంగర్ఫోర్ లేన్, జడ్చర్ల–మరికల్ఫోర్లేన్, మరికల్–దియాసాగర్వంటి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులివ్వాలి. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలి. ఎలక్ట్రానిక్స్మ్యాన్ ఫాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెమీ కండక్టర్లు, డిస్ప్లే మ్యాన్ ఫాక్చరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు సెమీ కండక్టర్ల మిషన్లో భాగంగా రాష్ట్రానికి సాయమందించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
పీఎంకు సీఎం రేవంత్ వీడ్కోలు
రెండు రోజుల తెలంగాణ పర్యటనను ముగించుకుని ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోదీకి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎంతో ప్రధాని కాసేపు ముచ్చటించారు.