
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నార్కట్పల్లి, వెలుగు : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా బుధవారం నార్కట్ పల్లి మండలం ఏపీలింగోటం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి భూసమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు ఏమైనా భూ సమస్యలుంటే రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ఈనెల 20 వరకు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని ‘అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ వెంకటేశ్వరావు, సీడీపీవో హరిత పాల్గొన్నారు.