న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ‘టెర్రరిస్ట్’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలవడాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా పరిగణించింది. దీంతో ఖర్గేకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ అధికారులు సూచించారు. ఖర్గే టెర్రరిస్ట్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా, మంగళవారం తమిళనాడులోని చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును విమర్శిస్తూ.. మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
పెరియర్, సీఎన్ అన్నాదురై ఫొటో పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా చేతులు కలపగలరని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఖర్గేకు ఈసీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధ కార్యాలయంగా పనిచేస్తోందనడానికి ఈ నోటీసులే నిదర్శమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

