అంగన్ వాడీ పిల్లలకు న్యూట్రీషన్ ఎగ్ బిర్యానీ.. ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

అంగన్ వాడీ పిల్లలకు న్యూట్రీషన్ ఎగ్ బిర్యానీ.. ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
  • ఎన్ఐఎన్ కు అధ్యయన బాధ్యతలు 
  • నివేదిక ఇవ్వగానే అమలు చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ పిల్లలకు న్యూట్రీషన్  ఎగ్ బిర్యానీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని నేషనల్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  న్యూట్రీషన్ (ఎన్ఐఎన్) కు మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ రిపోర్ట్  వచ్చాక రాష్ర్టవ్యాప్తంగా అంగన్ వాడీ పిల్లలకు ఎగ్ బిర్యానీ వడ్డించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11న అంగన్ వాడీ స్కూళ్లు స్టార్ట్  కాగా అదే రోజు పిల్లలకు ప్రయోగాత్మకంగా ఎగ్ బిర్యానీ పెట్టారు. పిల్లలు ఎంతో ఆనందంగా ఎగ్ బిర్యానీ తిన్నారని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు తెలిపారు. దేశంలో తొలిసారిగా రాష్ర్టంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించనున్నారు. 

రోజూ ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్ వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంగన్​వాడీల్లో పిల్లల సంఖ్య మరింత పెంచడానికి వేసవి సెలవుల్లో టీచర్లు, హెల్పర్లు గ్రామాల్లో అన్ని ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న ఫుడ్, ఇతర సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. 

11 లక్షల మంది పిల్లలు

రాష్ర్టంలో  35,700 అంగన్‌వాడీ కేంద్రాలు.. ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద పనిచేస్తున్నాయి. ఇందులో మూడేళ్లలోపు పిల్లలు 10,34,562 మంది ఉండగా,  3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 6,67,783 మంది ఉన్నారు. పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య తనిఖీలు, టీకాలు, ప్రీ-స్కూల్  విద్యను అంగన్‌వాడీల్లో అందిస్తున్నారు. ఇక హెల్త్  కార్యక్రమాల్లో భాగంగా 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు నెలకు 16  గుడ్లు, 3- నుంచి 6 సంవత్సరాల పిల్లలకు నెలకు 30 గుడ్లు అందిస్తున్నారు.  ప్రీ-స్కూల్  విద్య లో భాగంగా  ‘అంగన్‌వాడీ - బడిబాట’ కార్యక్రమం ద్వారా 3- నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ-స్కూల్  విద్యను ప్రోత్సహిస్తున్నారు. 

త్వరలో 10 వేల ఎన్జీవోలు

అంగన్ వాడీల్లో 10 వేల మంది ఎన్జీఓలను వలంటీర్లుగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించిన ఫైల్  సీఎస్  దగ్గరకు చేరినట్లు సమాచారం. పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, న్యూట్రీషన్  ఫుడ్ పై అవగాహన కల్పించడం వంటి విధులను వలంటీర్లతో చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఒక్కో వలంటీర్ కు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం.  అయితే వలంటీర్ల నియమాకాన్ని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న అంగన్ వాడీ ప్రాజెక్టుల్లో ఎన్జీఓ ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. వలంటీర్ల నియామక నిర్ణయాన్నిప్రభుత్వం  వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.