
- కలెక్టరేట్ సమావేశంలో ప్రభుత్వ విప్, కలెక్టర్ను కోరిన రైతులు
- రూ. 22 లక్షల వరకు పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్న కలెక్టర్
యాదాద్రి, వెలుగు: ఎకరానికి కనీసం రూ. 30 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇప్పించాలని గంధమల్ల రిజర్వాయర్ ముంపు బాధిత రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్లలో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఈ రిజర్వాయర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు 2500 మంది రైతుల నుంచి వెయ్యి ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీంతో రైతులను ఒప్పించేందుకు జిల్లా ఆఫీసర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. భూమిని కోల్పోతున్న వారితో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్లో బుధవారం మీటింగ్ నిర్వహించారు.
ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడానికి గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్నందున రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. తాము చిన్నకారు రైతులమని, ఎకరానికి కనీసం రూ. 30 లక్షలు ఇప్పించాలని మీటింగ్లో పాల్గొన్న రైతు ప్రతినిధులు తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు ఒక్కో ఎకరానికి రూ. 22 లక్షల వరకూ పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రైతు ప్రతినిధులు మాత్రం తాము ఉపాధి కోల్పోతున్నందున పరిహారం రూ. 30 లక్షల వరకూ ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కల్పించుకొని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మంచి పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, గంధమల్ల ముంపు బాధిత రైతులు పాల్గొన్నారు.