గంధమల్ల నిర్వాసితులకు రూ. 30 లక్షలు ఇప్పించండి.. కలెక్టర్‌‌‌‌ను కోరిన రైతులు

గంధమల్ల నిర్వాసితులకు  రూ. 30 లక్షలు ఇప్పించండి.. కలెక్టర్‌‌‌‌ను కోరిన రైతులు
  • కలెక్టరేట్‌‌ సమావేశంలో ప్రభుత్వ విప్, కలెక్టర్‌‌‌‌ను కోరిన రైతులు
  • రూ. 22 లక్షల వరకు పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్న కలెక్టర్

యాదాద్రి, వెలుగు: ఎకరానికి కనీసం రూ. 30 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇప్పించాలని గంధమల్ల రిజర్వాయర్​ ముంపు బాధిత రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్లలో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఈ రిజర్వాయర్​నిర్మాణానికి సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు 2500 మంది రైతుల నుంచి వెయ్యి ఎకరాలను సేకరించాల్సి ఉంది.  దీంతో రైతులను ఒప్పించేందుకు జిల్లా ఆఫీసర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. భూమిని కోల్పోతున్న వారితో ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్​ హనుమంతరావు కలెక్టరేట్‌‌లో బుధవారం మీటింగ్​ నిర్వహించారు. 

ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడానికి గంధమల్ల రిజర్వాయర్​ నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్నందున రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య తెలిపారు. తాము చిన్నకారు రైతులమని, ఎకరానికి కనీసం రూ. 30 లక్షలు ఇప్పించాలని మీటింగ్​లో పాల్గొన్న రైతు ప్రతినిధులు తెలిపారు.  కలెక్టర్​ హనుమంతరావు ఒక్కో ఎకరానికి రూ. 22 లక్షల వరకూ పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రైతు ప్రతినిధులు మాత్రం తాము ఉపాధి కోల్పోతున్నందున పరిహారం రూ. 30 లక్షల వరకూ ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య కల్పించుకొని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మంచి పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, గంధమల్ల ముంపు బాధిత రైతులు పాల్గొన్నారు.