- రేపటి నుంచి జరిగే అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు హాజరుకానున్న విద్యార్థులు
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్లారు. జపాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జపాన్ సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్ (సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్)కు తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ నెల 24 నుంచి 30 వరకు అక్కడ జరగనున్న అంతర్జాతీయ సైన్స్ సదస్సులో పాల్గొననున్నారు. జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, భారత విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మన విద్యార్థులు శుక్రవారం జపాన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖికి హాజరై, అత్యాధునిక పరిశోధనా సంస్థల సందర్శనతోపాటు జపాన్ విద్యా విధానాన్ని పరిశీలించనున్నారు.
ఎంపికైన విద్యార్థులు వీరే..
ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నామినేషన్లను స్వీకరించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ టెస్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురిని తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లాలోని ఎల్గందల్ మోడల్ స్కూల్ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని జి.శివాంజలి, హనుమకొండ జిల్లా హసన్ పర్తి తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీ ఫస్టియర్ విద్యార్థిని అక్షయ, మహబూబ్ నగర్ట్రిపుల్ఐటీలో ఫస్టియర్ స్టూడెంట్పరుష, సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మోడల్ స్కూల్ ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్వేణు ఉన్నారు.
ఈ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని చాటాలని సూచించారు. ఈ పర్యటన విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుతుందని, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి కమిషనర్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
