మాగంటి గోపీనాథ్కు పట్టిన గతే నీకు పడుతుంది .. నిన్ను చేతబడి చేసి చంపేస్తా

మాగంటి గోపీనాథ్కు పట్టిన గతే నీకు పడుతుంది .. నిన్ను చేతబడి చేసి చంపేస్తా
  • ఓ వ్యక్తికి సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బెదిరింపులు 
  • కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు 

గచ్చిబౌలి, వెలుగు : ‘నిన్ను చేతబడి చేసి చంపేస్తా.. మాగంటి గోపీనాథ్​కు పట్టిన గతే నీకూ పడుతుంది’ అంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాధితుడి ఫిర్యాదుపై కోర్టు అనుమతితో నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..గచ్చిబౌలిలోని ఎఫ్ సీఐ లేఔట్ లో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కబ్జాలు చేశాడంటూ యజమానులు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. 

దీంతో హైడ్రా అధికారులు ఇటీవల కబ్జాలను కూల్చివేసి.. రోడ్ల సర్వే చేసి మార్కింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రావు కొన్ని రోజుల క్రితం రెహమత్ నగర్ కు చెందిన నర్సింహారెడ్డికి ఫోన్​చేసి ‘నిన్ను చేతబడి చేసి చంపేస్తా.. మాగంటి గోపీనాథ్ కు పట్టిన గతే నీకు పడుతుంది’ అంటూ ఫోన్ లో బెదిరించాడు. శ్రీధర్ రావు ఫోన్ కాల్ బెదిరింపులను బాధితుడు వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ బెదిరింపులపై బాధితుడు నర్సింహారెడ్డి సోమవారం గచ్చిబౌలి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. నర్సింహారెడ్డి ఫిర్యాదును కోర్టుకు పంపి అనుమతి తీసుకున్న పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. 

కాగా, ఎఫ్ సీఐ లే ఔట్ సర్వే టైంలో నటి రమ్యశ్రీ సోదరుడు ప్రశాంత్ మీద దాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో శ్రీధర్ రావు, అతని అనుచరుడు వెంకటేశ్, మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు ఐదు రోజుల క్రితమే కేసు నమోదు చేశారు. ఇదే లేఔట్ లో సర్వే చేస్తుండగా తనను కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేయడంతో పాటు కారులో వెళ్తుండగా బైకులపై శ్రీధర్ రావు మనుషులు దాడి చేశారని మణికొండకు చెందిన కుషి చంద్ వడ్డే ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్ రావు, వెంకటేశ్​తో పాటు ముగ్గురిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల్లోనే శ్రీధర్ రావుపై 3 కేసులు నమోదు కావడం గమనార్హం.