
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మే 28న జరిగిన 'చింతపండు' చోరీ ఘటనలో అసలు దొంగలను పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన 'హైలెవల్' కమిటీ విచారణ షురూ అయింది. ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని హైలెవల్ కమిటీ సభ్యులు సోమవారం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ ఆరంభించారు. నలుగురు అడిషనల్ కమిషనర్లు, ఒక రీజినల్ జాయింట్ కమిషనర్ తో కూడిన హైలెవల్ కమిటీ బృందం.. చింతపండు చోరీ జరిగిన ప్రసాద తయారీ కేంద్రం, కన్వేయర్ బెల్ట్ ద్వారా చింతపండు బస్తాలను బయటకు తరలించిన ప్రదేశాలను పరిశీలించారు.
చోరీ జరిగిన రాత్రి ప్రసాద తయారీ కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రసాద తయారీ సెక్షన్ ఏఈవో, సూపరింటెండెంట్, స్టోర్ ఇన్చార్జీలను పలు రకాల ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. అనంతరం ఈవో కార్యాలయంలో ప్రసాద తయారీకి సంబంధించిన పలు పైళ్లను పరిశీలించారు. మంగళ, బుధవారం కూడా ఫీల్డ్ ఎంక్వైరీ ఉంటుందని ఆలయ అధికార వర్గాల ద్వారా తెలిసింది.