ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నారు. భారీ భద్రత నడుమ కవితను కారులో తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి కవితను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఈడీ వాహనాన్ని అనుసరిస్తూ కేటీఆర్ హరీష్ రావు కూడా వేరే కారులో బయలుదేరారు. లాయర్లతో కలిసి వారు ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఈడీ అధికారులతో కారులో వెళ్తూ కార్యకర్తలకు అభివాదం చేశారు కవిత . విక్టరీ సింబల్ చూపించారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని చెప్పారు. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని కవిత తెలిపారు.
ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. కవిత అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీశ్రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను కోరారు.