రూ.25 వేలు సాయం చేసిన గవర్నర్
నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన యువకుడికి రాజ్ భవన్ నుంచి ఆర్థిక సహాయం అందింది. గ్రామానికి చెందిన మందుల రామ్మూర్తి నిరుపేద కుటుంబంలో పుట్టినా కూలీ పనులకు వెళ్తూ ఇంటర్ వరకు చదివాడు. ఆర్థిక స్థోమత సరిగ్గా లేక చదువు మధ్యలోనే ఆపేశాడు. కుటుంబాన్ని చూసుకోవడం, ఇంటి బాధ్యతలు మీద పడడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. అవి తీర్చేదారి లేక ఆవేదనకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక సహాయం చేయాలంటూ జనవరి 2న రాజ్ భవన్ లోని కంప్లయింట్ బాక్స్లో లెటర్ వేశాడు. దీంతో రాజ్ భవన్ నుంచి నాలుగు రోజుల కింద ఆర్థిక సహాయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రూ.25వేల డీడీ పంపించారు. రామ్మూర్తి మాట్లాడుతూ ఈ సాయంతో తన ఇబ్బందులు పోతాయని, గవర్నర్ కు రుణపడి ఉంటానని చెప్పాడు.