ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల 'మెలోడీ' చాక్లెట్ ముచ్చట తెచ్చిన జోష్ స్టాక్ మార్కెట్లో అప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. పేరులో ఉన్న పోలిక వల్ల వచ్చిన గందరగోళంతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజైన గురువారం కూడా స్మాల్క్యాప్ కంపెనీ పార్లే ఇండస్ట్రీస్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు.
ఈ కంపెనీ షేర్లు 4.95 శాతం పెరిగి, రూ.5.51 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకాయి. మెలోడీ చాక్లెట్లతో పాటు పార్లే-జి, మొనాకో, హైడ్ అండ్ సీక్ వంటి బ్రాండ్లను తయారు చేసే అసలు సంస్థ 'పార్లే ప్రొడక్ట్స్' ఇంకా మార్కెట్లో లిస్ట్ కాలేదు. కానీ పేరు చూసి ఇన్వెస్టర్లు కొంటున్న పార్లే ఇండస్ట్రీస్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, పేపర్ వ్యాపారంలో ఉన్న చిన్న కంపెనీ.
