సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు (మర్రిగూడ), మునుగోడు, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం ఎర్రగండ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసికట్టుగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు.

గ్రామంలో విద్యుత్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. గ్రామంలో మురుగునీరు, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం మునుగోడు క్యాంపు కార్యాలయంలో హెల్త్ ఆఫీసర్లతో  సమీక్ష నిర్వహించారు. 

ఇండ్ల విషయంలో పేదలకు అన్యాయం.. 

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గం వెనుకబడిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైనవారు ఇండ్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పెట్టిన రూల్స్ సడలించి గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో వైఎస్ఆర్ సమయంలో గ్రామసభలు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేశామని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరికాదని, కొన్ని సడలింపులు చేసి అర్హులందరికీ ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.5 లక్షలతో ఇంటిని పూర్తి చేయలేమని, కనీసం ఏడున్నర లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.