
సూర్యాపేట, వెలుగు : దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అణచివేతకు పాల్పడుతున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ తోనే దళితులు, మైనార్టీలు, ఆదివాసీలకు రక్షణ లభిస్తుందన్నారు.
అన్నివర్గాల ప్రజలను కలుపుకుంటూ సామాజిక సమైక్యతను, దేశ సమగ్రతను కాపాడటానికి పార్టీ తీవ్ర కృషి చేస్తుందన్నారు. బంజారాల ఆరాధ్యదైవమైన సంత్ సేవలాల్ జయంతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సెలవుగా ప్రకటించారని పేర్కొన్నారు. సామాజిక న్యాయ పరిరక్షణకు కృషి చేస్తుందని కాబట్టి కాంగ్రెస్ కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ బంజారా బిడ్డలు పార్టీ సిద్ధాంతాలను తెలుసుకునేందుకే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఐదు జిల్లాల్లో పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ భూక్యా కోట్యానాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రామ్ ఇన్ చార్జ్ లింగం నాయక్, బాబు నాయక్, బంజారా ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.