
2022 డిసెంబర్ 30న కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా ఇటీవలే కర్రల సాయంతో నడుస్తున్న ఫొటో షేర్ చేసిన అతను తాజాగా ఓ ఇంటర్య్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టాడు. రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ తెలిసిందని పంత్ చెప్పాడు. గాయాల నుంచి కోలుకుంటూ..చిన్న పనులు చేస్తూ వాటిని ఆస్వాదిస్తున్నానని వెల్లడించాడు. బ్రష్ చేయడం నుంచి పొద్దున్నే ఎండకు కూర్చోవడం వంటి పనులు చేయడాన్ని ఎంతో సంతోషంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చాడు.
గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నానని పంత్ తెలిపాడు. భగవంతుడి దయ,డాక్టర్ల సహకారంతో త్వరలోనే మామూలు మనిషిని అవుతానని చెప్పాడు. ఫిట్ అవుతానని ఆశిస్తున్నానని..అయితే కచ్చితమైన సమయాన్ని చెప్పలేనన్నాడు. కార్ ప్రమాదం తర్వాత తన జీవితాన్ని భిన్నమైన కోణంలో చూస్తున్నాని వివరించాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తాను చేసే ప్రతీ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నానని పంత్ చెప్పుకొచ్చాడు.
ప్రతీ రోజూ ఫిజియోథెరపి సెషన్లో పాల్గొంటున్నానని...ఆ తర్వాత రిఫ్రెష్ అయ్యి సెకండ్ సెషన్కు సిద్దమవుతున్నానని పంత్ చెప్పాడు. సెకండ్ సెషన్ త్వరగా ప్రారంభించి ఎంత నొప్పిని భరించగలుగుతున్నాననే విషయాన్ని గ్రహిస్తున్నానంటూ వెల్లడించాడు. సాయంత్రం చివరి సెషన్తో రోజును ముగిస్తున్నాని తెలిపాడు. టైంకు పండ్లు, పానియాలు తీసుకుంటున్నానని చెప్పాడు. ఈ విధానం తాను పూర్తిగా కోలుకునేవరకు సాగుతుందన్నాడు.
తాను వేగంగా కోలుకోవాలని అనేక మంది మెసేజ్లు చేశారని..వారందరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు పంత్ తెలిపాడు. ఇంత మంది శ్రేయోభిలాషులు, అభిమానులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. టీమిండియాకు, ఢిల్లీ క్యాపిటల్స్ కు అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించాడు. అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమతో వేగంగా కోలుకుని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తానని పంత్ చెప్పుకొచ్చాడు.