విశాకకు రూ.25.92 కోట్లు చెల్లించండి: హైకోర్టులో విశాక ఇండస్ట్రీస్‎కు ఊరట

విశాకకు రూ.25.92 కోట్లు చెల్లించండి: హైకోర్టులో విశాక ఇండస్ట్రీస్‎కు ఊరట

హైదరాబాద్‌: ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఇన్‌ స్టేడియా ప్రకటనలు, నామకరణ హక్కులకు సంబంధించిన కేసులో విశాక ఇండస్ట్రీస్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) దాఖలు చేసిన అప్పీల్‌ (సీవోఎంసీఏ నం. 32 / 2024)ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. తద్వారా మార్చి 15, 2016 నాడు ఇచ్చిన ఆర్బిట్రల్‌ అవార్డును సమర్థించింది. 2004లో అమలు చేయబడిన ఒప్పందం నుంచి ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక వివాదానికి ఇది తుది పరిష్కారంగా సూచించింది. 

ఈ మేరకు వడ్డీ, ఖర్చులతో పాటు రూ. 25.92 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆర్బిట్రల్‌ అవార్డును జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ బీఆర్‌ మధుసూధన్‌ రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విశాకకు అనుకూలంగా తీర్చు ఇచ్చింది. ఈ ఆర్బిట్రల్‌ అవార్డును జులై 2024లో వాణిజ్య కోర్టు కూడా ఆమోదించింది. విశాక, హెచ్‌సీఏ మధ్య మధ్యవర్తిత్వ చర్యలు నిష్పాక్షికంగా, పక్షపాతం లేకుండా జరిగాయని కోర్టు ధ్రువీకరించింది. 

ఈ తీర్పు 1996 మధ్యవర్తిత్వం, రాజీ చట్టం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపింది. ఆర్థిక ఒత్తిడి, ఇతర ప్రయోజనాలకు సంబంధించి హెచ్‌సీఏ తన ఆఫీస్‌ బేరర్లు లేవనెత్తిన ఆరోపణలు నిరాధారమైనవని తిరస్కరించింది. భారతీయ కాంట్రాక్ట్‌ చట్టం 1872లో సెక్షన్‌ 73, 74 ప్రకారం స్పష్టమైన నిబంధనలు, సంబంధిత చట్టపరమైన ప్రమాణాల ఆధారంగా విశాక లిక్విడేటెడ్‌ నష్టపరిహారంగా చెల్లించిన దానికి ఆరు రెట్లు పరిహారాన్ని ట్రిబ్యునల్‌ మంజూరు చేయడాన్ని కోర్టు సమర్థించింది.