
- సమాచారం లేకుండా పేల్చడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
గన్నేరువరం, వెలుగు: వ్యవసాయ బావుల్లో పూడిక తీసే సమయంలో బండరాళ్లను పగలగొట్టేందుకు జిలిటెన్ స్టిక్స్ వాడుతున్నారు. స్థానికులకు సమాచారం ఇవ్వకుండా పేల్చడంతో భారీ శబ్ధాలకు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీ ఇండ్ల సమీపంలో ఉన్న వ్యవసాయ బావుల్లో పూడిక తీసేందుకు రాళ్లు అడ్డొస్తున్నాయని మంగళవారం జిలిటెన్ స్టిక్స్ పేల్చారు.
స్థానికులను సమాచారం ఇవ్వకుండా పేల్చడంతో భారీ శబ్ధాలతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుధవారం కూడా పోలీస్ స్టేషన్ సమీపంలోనే మరోసారి పేలుళ్లు జరిగాయి. అనుమతులు లేకుండా రాళ్లను పేల్చుతున్నారని దీంతో ఇళ్లు ఊగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడు పదార్థాలను ఉపయోగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.