
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బుధవారం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ తరువాత సెక్రటేరియెట్ లో మీడియా పాయింట్ దగ్గర ఎంపీలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? ప్రాజెక్టును ఆపేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? తదితర కీలక అంశాలు మీటింగ్ లో చర్చకు వచ్చాయన్నారు.
పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మేం పాల్గొన్నామని డీకే అరుణ వెల్లడించారు. బనకచర్ల నిర్మాణం వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. గోదావరి నదిలో తెలంగాణ వాటా నీటి కేటాయింపుల్లో ఎంత మేర వాడుకున్నాము? గోదావరి నదిపై పూర్తి కావాల్సిన ప్రాజెక్టులెన్ని? ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు? ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనే విషయాలపై తాము వివరాలు అడిగామని ఎంపీలు డీకే అరుణ, రఘనందన్ రావు తెలిపారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తుందని ఎంపీలు వెల్లడించారు.