ఏపీలో ని పుత్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్సవాల సందర్బంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు. కళ్లముందే కుమారుల మృతిచెందడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి జిల్లా పుత్తూరులో శుక్రవారం (ఆగస్టు14) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ద్రౌపతమ్మ-ధర్మరాజుల ఉత్సవాల సందర్భంగా పుత్తూరులోని కె.ఎన్. రోడ్డులోని పూజా టెక్స్టైల్స్ దగ్గర ఫ్లెక్సీ కట్టేందుకు కొంతమంది విద్యార్థులు గుమిగూడారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ఐరన్ రాడ్ ప్రమాదవశాత్తూ 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను విగ్నేష్ (19), గోకుల్ (18)గా గుర్తించారు. మృతులిద్దరు స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
