చెన్నూరు నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలు!

చెన్నూరు నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలు!

‘‘ చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ను  గెలిపించుకున్నాం.. కానీ ఆయన ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు’’ అని బాల్క సుమన్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన చెరుకు సరోత్తం రెడ్డి ఆరోపించారు. భీమారం మండలానికి ఇచ్చిన హామీలను సుమన్ విస్మరించారని ఆయన వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సరోత్తం రెడ్డి  మాట్లాడారు. కావాలనే తనపైన బాల్క సుమన్ కు కొందరు ఫిర్యాదులు చేశారని అన్నారు. ఆయన కూడా నాతో మాట్లాడి.. కొన్ని భరించాలి అని అంటేనే ఇన్ని రోజులు భరించానన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంపు కార్యాలయంలోకి కొందరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ కేవలం ఇద్దరు, ముగ్గురినే ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

భీమారం మండలంలో ఊర చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూస్తే కొందరు అడ్డుపడుతున్నారని సరోత్తం రెడ్డి ఆరోపించారు. సుమన్ క్యాంపు కార్యాలయంలోకి రానివ్వడం లేదంటూ చాలా మంది సర్పంచ్ లు  తనతో ఆవేదన వ్యక్తం చేశారని సరోత్తం వ్యాఖ్యానించారు. తనతో పాటు చాలామంది పార్టీ నుంచి బయటకి రావాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలు ఉంటాయని స్పష్టం చేశారు. సుమన్ ఇలాగే ఒంటెద్దు పోకడలు పోతే నియోజకవర్గంలో వ్యతిరేకత తప్పదని సరోత్తం రెడ్డి హెచ్చరించారు.