ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీపి కబురు.ఇప్పటివరకు మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు 21,546 రూపాయలు ఉండగా. ఇప్పుడు అది ఏకంగా 1,459 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం టన్ను ధర 23,005 రూపాయలకు చేరుకుంది. ఈ సానుకూల పరిణామంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ ధరల పెరుగుదల రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని మంత్రి తుమ్మల అన్నారు. రైతులకు ఉచితంగా మొక్కల సరఫరా చేయడం, అత్యాధునిక డ్రిప్ సాగు సౌకర్యం కల్పించడం,వేగంగా దిగుబడిని తరలించేందుకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి కీలక అడుగులు వేస్తోందన్నారు.
ఆయిల్ పామ్ అనేది దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే పంట అని.. పెరిగిన ధరలు రైతుల్లో నమ్మకాన్ని పెంచుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సలహాలను సద్వినియోగం చేసుకొని మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.
