వాసాలమర్రి ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

వాసాలమర్రి ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • బీఆర్‌‌‌‌‌‌ఎస్ మొండిగోడలే మిగిల్చింది.. మేం ఇండ్లు నిర్మించి ఇస్తాం 
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ బంగారు వాసాలమర్రి చేస్తానని చెప్పి ఇండ్లన్నీ కూలగొట్టి మొండిగోడలుగా మార్చారని  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు.సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రానికే మోడల్ గా నిలిచేలా వాసాలమర్రిని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రభుత్వ విప్  బీర్ల అయిలయ్య తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాసాలమర్రిలో 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడానికి గురువారం రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాసాలమర్రికి రానున్నట్లు వెల్లడించారు.  గతంలో కేసీఆర్ వాసాలమర్రిని బంగారు వాసాలమర్రి చేస్తానని చెప్పి ఇండ్లన్నీ కూల్చేసి కొత్త ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చి అంతటితోనే ఆపేశారని గుర్తుచేశారు.  ఇండ్లు కట్టిస్తామని బీఆర్ఎస్ సర్కార్ పేపర్లకే పరిమితమైందని, కానీ తాము ఇండ్లు కట్టించి గృహ ప్రవేశం చేపిస్తామని పేర్కొన్నారు. 

ఆకుల ఆగవ్వకు మొదటి ఇంటి ప్రొసీడింగ్ కాపీ అందజేస్తాం 

వాసాలమర్రిలో 227 మందికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు చెప్పారు.  సీఎం హోదాలో వాసాలమర్రిని డెవలప్ చేస్తానని మాట తప్పడం కేసీఆర్ కు అలవాటైతే..  గ్రామస్తులెవరూ అడగకున్నా వాసాలమర్రిని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో వాసాలమర్రికి కేసీఆర్ వచ్చి అల్లనేరేడు పండు ఇచ్చి ఆస్పత్రి పాలు చేసిన ఆకుల ఆగవ్వకు మొదటి ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ కాపీని మంత్రి పొంగులేటి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.  కేసీఆర్ బొందలగడ్డగా మార్చిన వాసాలమర్రిని అత్యాధునిక హంగులతో గొప్పగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.  గురువారం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి సక్సెస్ చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్యా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ దేశ్యానాయక్, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయక్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు  ఉన్నారు.