హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలకు నీళ్లు అందించేందుకు రూ.4,874 కోట్లతో వార్దాపై బ్యారేజీ నిర్మిస్తామని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ తెలిపారు. వ్యాప్కోస్ సంస్థ రూపొందించిన ఈ ప్రాజెక్టు డీపీఆర్ను త్వరలోనే సీడబ్ల్యూసీకి సమర్పించి అవసరమైన అనుమతులు తీసుకుంటామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ స్కీమ్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులపై గురువారం జలసౌధలో ఈఎన్సీలు, సీఈలతో ఆయన సమీక్షించారు.
ప్రాజెక్ట్ పనులన్నీ వానాకాలం సీజన్ ప్రారంభంలోగా పూర్తి చేయాలని, పూర్తి కాకపోతే సంబంధిత సీఈపై చర్యలు తప్పవనిహెచ్చరించారు. పనులపై సంబంధిత ఈఎన్సీ ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రివ్యూ చేయాలని ఆదేశించారు. ఈఈలు, డీఈఈలు ఆయా పనులను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. పంట కాల్వల్లో పూడికతీత, ఇతర పనులు చేపట్టేందుకు ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
డ్యామ్లు, రిజర్వాయర్ల భద్రతను పరిశీలించాలని సూచించారు. డ్యామ్ సేఫ్టీ అండ్ డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్), చెక్ డ్యామ్లు, ఏఐబీబీలో భాగంగా చేపట్టిన పనులపైనా రజత్కుమార్ సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, పునరావాస పనులపై రివ్యూ చేశారు. సమీక్షలో ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, శంకర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.