
బషీర్బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేస్తామని చెప్పి ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యాపారికి ఈ నెల 3న ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పేరుతో స్కామర్స్ ఫోన్ చేశారు. ‘మీ క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లెయిమ్ చేస్తాం’ అని చెప్పారు. అనంతరం వ్యాపారి వాట్సాప్ కు ఓ లింకును పంపించారు.
ఐ ఫోన్ కావడంతో ఆ లింక్ ఓపెన్ కాలేదు. దీంతో స్కామర్స్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సిమ్ వేసుకోవాలనిసూచించడంతో... బాధితుడు అలాగే చేశాడు. అందులో లింక్ ను ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేశాడు. కాసేపటికి బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్షా 23 వేల 324 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆన్లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.