108 సిబ్బంది చేతివాటం.. రెండు కిలోల బంగారం చోరీ

108 సిబ్బంది చేతివాటం.. రెండు కిలోల బంగారం చోరీ
  • చికిత్స అందించే సమయంలో 108 సిబ్బంది చేతివాటం
  • సుమారు 2 కేజీల 300 గ్రాముల బంగారం చోరీ
  • పోలీసుల అదుపులో అంబులెన్స్ డ్రైవర్, EMT
  • రూ.కోటి 15 లక్షల విలువైన బంగారం స్వాధీనం

రామగుండం: చావుబతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించాల్సిన 108 సిబ్బంది.. మానవత్వం మరిచారు. డబ్బు మీద ఉన్న వ్యామోహంతో..  కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి  నుంచి బంగారం కాజేశారు. చివరకు ఆ వ్యక్తి  మరణించిన తర్వాత తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మల్యాల పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో చోరీకి గురైన బంగారం కేసును పోలీసులు చేధించారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే క్రమంలో 108 సిబ్బందే అతని వద్ద ఉన్న సొమ్మును కాజేశారని స్థానిక రామగుండం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల్ని బుధవారం ఉదయం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 2 కిలోల 30 తులాల  బంగారం స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు ,కొత్త రాంబాబు, గుండ సంతోష్ లు బంగారం వ్యాపారులు.  అర్డర్లపై బంగారం సప్లై చేసే ఆ ముగ్గురూ వ్యాపార నిమిత్తం సుమారు 5 కేజీల 600 గ్రాముల బంగారంతో కారులో ప్రయాణిస్తుండగా.. మల్యాల పల్లి రామగుండం మూలమలుపు వద్ద యాక్సిడెంట్ జరిగింది. కారు డ్రైవర్ సంతోష్ కుమార్ నిద్రమత్తులో ఉండడంతో రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టగా అందులో ప్రయాణిస్తున్న కొత్త శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శ్రీనివాస్ దగ్గరున్న 2 కేజీల 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురి గురించి 108 సిబ్బందికి సమాచారమందించగా… 108 అంబులెన్స్ సిబ్బంది EMT చాంద్,  డ్రైవర్ రాజేందర్ లు  గంట సంతోష్ ను గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతని షర్ట్ జేబులో ఉన్న 1 కేజీ బంగారు ఆభరణాలను ఆస్పత్రి వద్ద రామగుండం ఎస్ఐ శైలజ గారికి అందజేశారు.  డ్రైవర్ సంతోష్ కుమార్ ను HKR అంబులెన్స్ లో అదే ఆసుపత్రికి తరలించారు. కోన ఉపిరి తో ఉన్న మరో వ్యక్తి కొత్త రాంబాబుని కమాన్ పూర్ కి చెందిన మరో అంబులెన్స్ లో EMT తాజుద్దీన్, డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే  మార్గమధ్యలో అతనికి ప్రథమ చికిత్స అందించే క్రమంలో అతని చొక్కా  జేబులో ఉన్న రెండు ప్లాస్టిక్ కవర్లలో ఉన్న సుమారు 2 కిలోల 300 గ్రాముల బంగారం చూసేసరికి EMT తాజోద్దీన్ కి మనసులో దురాశ కలిగింది. ఆ బంగారాన్ని చోరీ చేసి దర్జాగా బ్రతకవచ్చని తలచి.. డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి కి ఆ విషయాన్ని చెప్పాడు. అందుకు అతను కూడా సరే అనడంతో 2 ప్లాస్టిక్ కవర్ లో ఉన్న బంగారు ఆభరణాలను పంచుకున్నారు. అయితే పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే  రాంబాబు చనిపోవడంతో అతని మృత దేహన్ని ఆస్పత్రిలో చేర్చి..  తమకేమీ ఎరుగనట్టు అక్కడి వారు ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు దాచిపెట్టి.. ఎవరు డ్యూటీకి వారు వెళ్లిపోయారు.

కానీ మృతులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు ల కుటుంబ సభ్యులు కొత్త నాగేశ్వరరావు.. మొత్తం 5,600 గ్రాముల బంగారు అభరణాలకు బదులు 3 కిలోల 300 గ్రాములు మాత్రమే దొరికాయని, మిగిలిన 2 కిలోలు 300 గ్రాములు బంగారం దొరకలేదని రామగుండం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో  రామగుండం ఎస్ఐ శైలజ దర్యాప్తు ప్రారంభించారు. అంబులెన్స్ సిబ్బందిపై అనుమానంతో విచారణ చేయగా అసలు బయటపడింది. విచారణలో తాజుద్దీన్, లక్ష్మారెడ్డిలు కలిసి ఈ చోరీ చేశారని తెలియడంతో.. వారిద్దర్నీ బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి చెరో ప్లాస్టిక్ కవర్ల బంగారు ఆభరణాలు 2 కిలోలు 300 గ్రాములు ను పోలీస్ లు స్వాధీనం  చేసుకొన్నారు. వాటి విలువ సుమారు ఒక కోటి 15 లక్షలు  ఉంటుందని తెలిపారు.