
- హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్
- రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 12 లక్షల కేసులు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: లోక్ అదాలత్ పురాతన విధానమని, ఇందులో రాజీ ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ అన్నారు. కోర్టుల్లో ఒక పార్టీనే గెలుస్తుందని, ఓడిన పార్టీ పైకోర్టుకు అప్పీలుకు వెళుతుందన్నారు. ఇలాంటి వివాదాలకు తెర దించడానికే లోక్అదాలత్ను ప్రారంభించారని తెలిపారు. ఇక్కడ పార్టీలిద్దరూ విజేతలేనని చెప్పారు. లోక్ అదాలత్లు కోర్టుల విలువైన సమయాన్ని కాపాడటంతో పాటు ఇరు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టిస్తాయన్నారు.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో లోక్ అదాలత్ను సీజే ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో కమ్యూనిటీ మీడియేషన్ను ప్రారంభించామని తెలిపారు. కుటుంబ వివాదాలు, తల్లిదండ్రులు, పిల్లల వివాదాలను కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చని, దీని ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి పాల్గొన్నారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 12.48 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట్ర న్యాయసేవాధికార సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి వెల్లడించారు. వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 7.85 లక్షల కేసులు, 4.63 లక్షల ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించామని వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిహారంగా రూ.935 కోట్లను ప్రకటించామని తెలిపారు.
హైకోర్టులో 120 కేసులు పరిష్కారం
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లనారాయణ అలిశెట్టి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవితో కూడిన ధర్మాసనం 120 కేసులను పరిష్కరించింది. ఇందులో 84 మోటారు వాహన ప్రమాద కేసులు ఉండగా.. రూ.9 కోట్లను పరిహారంగా ప్రకటించామని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. ఈ అదాలత్ ద్వారా 750 మంది లబ్ధి పొందారన్నారు.