స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం

స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం

స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలిక.. అత్యాచారానికి గురై.. ఆపై హత్య చేయబడింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం స్కాలర్‌షిప్ కు అప్లై చేయడం కోసం సమీపంలోని పట్టణానికి వెళ్లింది. కానీ, ఆ బాలిక మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మంగళవారం ఉదయం ఊరికి 200 మీటర్ల దూరంలోని నీళ్లులేని చెరువు వద్ద బాలిక మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ఆధారంగా బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్యచేశారని తేలింది.

‘పోస్టుమార్టం నివేదిక ద్వారా అత్యాచారాన్ని ధృవీకరించాం. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే కేసులో పురోగతి సాధిస్తాం. పదునైన ఆయుధంతో బాలికను చంపారు. ఆమె మెడ చుట్టూ గాయాలయ్యాయి’ అని ఖేరి పోలీసు చీఫ్ సతేందర్ కుమార్ తెలిపారు.

బాలిక మృతిపై ఆమె కుటంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘మాకు ఏం చెప్పాలో, ఎవరిని అనుమానించాలో కూడా తెలియడం లేదు. బాలిక సోమవారం స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది’ అని వారు తెలిపారు.

కాగా.. ఇదే జిల్లాలో అత్యాచారం మరియు హత్య జరగడం గత పది రోజుల్లో ఇది రెండవది. ఆగష్టు 15న 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో వరుస హత్యాచారాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

For More News..

పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా