కర్ణాటక: జ్వరం వచ్చిందని 2 నెలల చిన్నారిని అంగన్ వాడి సెంటర్ కి తీసుకువస్తే నర్స్ నిర్లక్ష్యంతో పాప మరణించింది. ఈ సంఘటన శనివారం కర్ణాటకలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. బెళగావి జిల్లా గోకాక్ మండలం, హుణశ్యాళ పీజీ గ్రామానికి చెందిన చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీప అంగన్వాడీ సెంటర్కు తీసుకొచ్చారు. ట్రీట్ మెంట్ పై సరైన అవగాహనలేని అక్కడి నర్స్ పెంటాపెస్ట్ అనే ఇంజెక్షన్ను పాపకు ఇచ్చింది. దీంతో సూది వేసిన వెంటనే చిన్నారి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయిందని, తర్వాత కొంత సేపటికి మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.
సాధారణంగా అంటువ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే పెంటాపెస్ట్ ఇంజెక్షన్ ఇస్తారని, జ్వరం వచ్చినప్పుడు ఉపయోగించరని, కానీ ఈ నర్స్ చేసిన పనికి తమ చిన్నారిని పోగొట్టుకున్నట్లు వారు ఆరోపించారు. నర్స్ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మరణించిందని విలపించారు. ముద్దులొలికే పసిపాపకు అప్పుడే నూరేళ్లు నిండాయా.. అని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి చిన్నారి కన్నుమూసినట్లు పోస్ట్ మార్టమ్ లో తేలిందన్నారు పోలీసులు. నర్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.