జపాన్ లో 155 సార్లు ప్రకంపనలు.. 24 మంది మృతి

జపాన్ లో 155 సార్లు ప్రకంపనలు.. 24 మంది మృతి

భారీ భూకంపం జపాన్ ను అతలాకుతలం చేసింది. వరుస ప్రకంపనలతో వేలాది ఇండ్లు,  భవనాలు కుప్పకూలిపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఫిషింగ్ బోట్లు మునిగిపోయి ఒడ్డుకు కొట్టుకుపోయాయి.రోడ్లు కుంగిపోయి పగుల్లు ఏర్పడ్డాయి. వాటర్ సప్లై నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుల్లెట్ ట్రైన్ ను ఆపేశారు.    ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇంకా వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. మరో వైపు జపాన్ వాతావరణ సంస్థ సునామీ  హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. 

తీర ప్రాంతాలకు సునామీ ముప్పు

జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వరుస భూకంపాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జపాన్‌‌ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే చాన్స్ ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. హోక్కాయిడో నుంచి నాగసాకి దాకా సునామీ ముప్పు ఉన్నట్లు తెలిపింది. తీర ప్రాంతం నుంచి దూరంగా.. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఇషికావాలోని వాజిమా పోర్టులో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో అలలను గుర్తించారు.

2011లో 18,500 మంది మృతి

2011, మార్చిలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9గా నమోదైంది. అప్పుడు సునామీ రావడంతో 18,500 మందికిపైగా చనిపోయారు. ఫుకుషిమాలోని న్యూక్లియర్ ప్లాంట్ కూడా దెబ్బతిన్నది. మూడు రియాక్టర్లు ధ్వంసం అయ్యాయి. చెర్నోబిల్ తర్వాత అత్యంత తీవ్రమైన న్యూక్లియర్ ప్రమాదంగా ఇది నిలిచింది. తర్వాత.. 2022, మార్చిలో ఫుకుషిమా తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.