హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల స్థానికతను గుర్తించకుండా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి తమ జీవితాలతో చెలగాటం ఆడిందని 317 జీవో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను వారు ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఉద్యోగులు, కుటుంబాలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత, ప్రమోషన్లు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. 317 జీవోపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తీసుకునే నిర్ణయాలతో తమ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీలో అధ్యయనం చేసి న్యాయం చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను పున:సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని చెప్పారు.