- మూసీ నదిలో 48 రకాల కెమికల్స్ ఆనవాళ్లు
- ప్రపంచంలోని ప్రమాదకర నదుల్లో 22వ స్థానం
- 104 దేశాల్లోని 258 నదులపై సైంటిస్టుల అధ్యయనం
హైదరాబాద్, వెలుగు: మూసీ నీళ్లలో కెమికల్స్ విపరీతంగా పెరిగిపోయాయని సైంటిస్టులు తేల్చారు. ఆ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషధ పదార్థాల(ఏపీఐ) ఆనవాళ్లను గుర్తించారు. యాంటీ బయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్లు కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయని వెల్లడించారు. ఈ నీటితో ఒక మందుల కంపెనీని నడిపించవచ్చని, నేరుగా మందులు తయారు చేయవచ్చని అంటున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలు మెడిసిన్స్తో సమానమని చెబుతున్నారు. అంటే రోగం లేకపోయినా మందులు వేసుకుంటున్నట్లే అని, దీంతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు వాళ్లకు దానికి సంబంధించిన మందులు పని చేయవని చెబుతున్నారు. రోగం లేని వారికి కొత్త రోగాలు రావడం గ్యారెంటీ అంటున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై స్టడీ చేసింది.
దేశవిదేశాల నిపుణులతో కూడిన ఈ బృందం 140 దేశాల్లోని 258 నదుల నుంచి శాంపిళ్లను సేకరించింది. మనదేశంలో ఢిల్లీలోని యమునా, హైదరాబాద్లోని మూసీని ఎంపిక చేసుకున్నారు. ప్రపంచంలోని డేంజరస్ నదుల్లో మూసీ 22వ స్థానంలో నిలిచింది. ఈ స్టడీ పోయినేడాది చివర్లో పూర్తయ్యింది. ‘ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’(పీఎన్ఏఎస్) అనే జర్నల్ లో ‘ఫార్మాస్యూటికల్ పొల్యూషన్ ఇన్ ది వరల్డ్స్ రివర్స్’ పేరుతో ఆ వివరాలు ప్రచురితమయ్యాయి
మూసీ నీళ్లల్లో ఏమేం ఉన్నాయంటే..
మూసీ నీళ్లలో యాంటీ బయాటిక్స్ (బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వాడే మందులు), యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, నొప్పిని తగ్గించే, సర్దీ, అలర్జీని తగ్గించే, షుగర్ను తగ్గించే, ఒత్తిడి, నరాలకు సంబంధించిన మందులు, బ్రెయిన్ కి వాడే అనేక రకాల ఔషధాల ఆనవాళ్లు ఉన్నాయని స్టడీ తేల్చింది. జ్వరం కోసం వాడే పారాసిటమాల్ అవశేషాలూ ఉన్నట్లు తేలింది. ఔషధాల సైంటిఫిక్ పేర్లు పరిశీలిస్తే మూసీలో సల్ఫామెతోక్జజోల్, మెట్రోనిడజోల్, మెట్ఫార్మిన్, సిట్రిజిన్, ఫెక్సోఫెనడైన్, ట్రిమెంతోప్రిమ్, ఎన్లాఫాక్సిన్, సిటాలోప్రామ్, గాబాపెంటిన్, వెల్నఫాక్సిన్, నాప్రాక్సిన్లు పెద్ద మొత్తంలో పేరుకుపోయినట్లు గుర్తించారు. ఆసియాలోని నదుల్లో 48 రకాల ఔషధ ఆనవాళ్లు ఉండగా.. ప్రపంచంలోని అన్ని నదుల్లో 14 రకాల పదార్థాలు కామన్గా ఉన్నట్లు తేలింది. లైఫ్ స్టైల్ కాంపౌండ్లుగా పిలిచే కెఫీన్, నికోటిన్లు భారీగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏం జరుగుతుందంటే..
మూసీ పరీవాహకంలో ఉండే జనం అక్కడి భూగర్భ జలాలను తాగితే నీటి ద్వారా, వ్యవసాయానికి వాడితే కూరగాయలు, ఆకుకూరల ద్వారా ఈ ఔషధ పదార్థాలు శరీరంలోకి చేరి ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. తాజా స్టడీ ప్రకారం పారాసిటమాల్ఆనవాళ్ల కారణంగా ఆ ప్రాంతవాసులు జ్వరం వచ్చినపుడు సాధారణ మందులు వాడితే త్వరగా తగ్గకపోవచ్చని నిపుణులు అంటున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకినపుడు యాంటీ బయాటిక్ అవశేషాల కారణంగా మందులు పని చేయవని, ఇతర రోగాలకు కూడా మందులు పనిచేయక రెసిస్టెన్స్ వస్తుందని చెబుతున్నారు.
ఎన్నో రోగాలు వస్తున్నాయి..
మూసీలో లవణాలు పెరగడం వల్ల బ్లూబేబీస్ అనే వ్యాధులు వస్తున్నాయి. ఆ నీటిని తాగిన వారిలో నపుంసకత్వం వస్తుంది. ఆర్థరైటిస్, చర్మవ్యాధులు, కిడ్నీ జబ్బులు, రకరకాల కేన్సర్లు వస్తాయి. భార లవణాల మోతాదు పెరడం వల్ల 60 నుంచి 70 శాతం మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గొంతునొప్పి, కడుపునొప్పి సమస్యలు పెరుగుతున్నయి.
– డాక్టర్ ఏవీ రాజశేఖర్,
జువాలజీ లెక్చరర్, ఓయూ
మళ్లా మందులు తయారుచేయొచ్చు
మూసీపై తాజా అధ్యయనం చూస్తే ఆ నీటితో మళ్లీ ట్యాబ్లెట్లు తయారు చేయవచ్చని అర్థమవుతోంది. ఆ స్థాయిలో మూసీలో ఔషధ ఆనవాళ్లు పేరుకుపోయాయి. ఫార్మా కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలను మూసీ లో డంప్ చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.
- నక్క సాయిభాస్కర్ రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్
ఫార్మా వేస్ట్కు డంపింగ్ యార్డుగా మార్చారు
మూసీ పరీవాహక ప్రాంతంలో 70 కిలోమీటర్ల దాకా నీరు కాలుష్యమైంది. ఫార్మా, ఇతర పరిశ్రమల వ్యర్థాలు పారేసేందుకు మూసీని డంపింగ్ యార్డుగా వాడుతున్నారు. దీనిపై మేం రెండేండ్ల కిందటే పరిశోధనలు చేశాం. నల్గొండ జిల్లా వలిగొండ దాకా మూసీ పొల్యూట్ అయ్యింది. భూగర్భంలో 40 మీటర్ల లోతు వరకు కాలుష్యం చేరిపోయింది. ఈ నీళ్లతో అనేక రోగాలు వస్తున్నాయి. నీటిలో 0.3 మిల్లీ గ్రాముల వరకు ఉండాల్సిన బయో కెమికల్ ఆక్సిడెంట్లు 172 ఎంజీల నుంచి 185 ఎంజీల వరకు చేరాయి.
- రాందాస్, రిటైర్డ్ ప్రొఫెసర్, జియోఫిజిక్స్, ఓయూ