అవినీతిని అంతం చేయాలంటే రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలి: CM చంద్రబాబు

అవినీతిని అంతం చేయాలంటే రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలి: CM చంద్రబాబు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జూన్ 8) ఓ నేషనల్ మీడియా చానెల్‎కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్, వక్ఫ్ చట్టం, వన్ నేషన్ వన్ ఎలక్షన్, పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దుపై తన అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. అవినీతిని నిర్మూలించడానికి పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలని తాను నమ్ముతున్నానని అన్నారు. 

అత్యధిక విలువ కలిగిన నోట్లు రూ.100, రూ.200 లోపే ఉండాలని.. రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడే సమాజంలో మనం అవినీతిని నిర్మూలించగలమని అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు సమర్ధించారు.

ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. కళ్ల ముందే భర్తలను కోల్పోయిన భారతీయ మహిళల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారత సైనిక చర్యకు ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారని తెలిపారు. 20 నిమిషాల్లోనే ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామన్నారు. 

ఆపరేషన్ సిందూర్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక గొప్ప ఘనత అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణను ఆపడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారని.. ఆయన గ్లోబల్ లీడరని ప్రశంసలు కురిపించారు. మోడీ కాకుండా మరే వ్యక్తి ఇంత కచ్చితంగా ఆ పని చేయలేడన్నారు. భారత్ ఎవరితో అనవసరంగా గొడవ పడదు. ఎవరైనా మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని తెలిపారు.