
కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల పరీక్షలపై సమీక్షించారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేసి…వారిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాకుండానే 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేశారని తెలిపారు. అంతేకాదు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారి ఇళ్లకే పంపిస్తామన్నారు. మార్చి 31వ తేదీన సమీక్షను నిర్వహించి 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.