
- పొంగిపొర్లుతున్న నదులు, డ్యామ్లు
- సురక్షిత ప్రాంతాలకు 6 వేల మంది తరలింపు
- అస్తవ్యస్తంగా జనజీవనం
అహ్మదాబాద్: గుజరాత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది. వర్షాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఏడుగురు చనిపోయారు. గాంధీనగర్, ఖేడా, వడోదరలో గోడ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆనంద్ జిల్లాలో చెట్టు మీదపడి ఒకరు, నీటిలో మునిగి మరో ఇద్దరు మరణించారు. భారీ వానలకు నదులు, వాగులు, డ్యామ్ లు నిండిపోయాయి.
లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవితం అస్తవ్యస్తమైంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా పంచ్ మహల్, నవ్సారీ, వల్సాద్, వడోదర, భరూచ్, ఖేడా, గాంధీనగర్, బోటడ్, ఆరావళి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆరువేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వార్షికంగా నమోదు కావాల్సిన సగటు వర్షపాతం.. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నమోదైందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్(ఎస్ఈఓసీ) అధికారులు తెలిపారు. ఈ సీజన్లో కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లో 100% కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డయిందని చెప్పారు. ఇక, బుధ, గురువారాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
హిమాచల్, రాజస్థాన్ లోనూ భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్లోనూ మంగళవారం వర్షం దంచికొట్టింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 126 రోడ్లను క్లోజ్ చేశారు. వచ్చే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేశారు. రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురిశాయి. బాన్స్ వారా జిల్లా
బాగీడోరాలో గత 24 గంటల్లో 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లోనూ 16.7, 16.5, 14, 13.5, 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.