బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్కూల్ బస్సు ఢీ కొట్టి ఓ చిన్నారి ప్రాణాలు విడిచిన ఘటన ఆగస్టు 2న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి ఇందిరా నగర్లో నివసిస్తున్న కిశోర్తన కుమార్తె దీక్షిత(8)ను బౌరంపేటలోని స్కూల్కి స్కూటీపై తీసుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన బస్సు వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి పై నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.